Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ అభిప్రాయ పడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెల నెలా లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని.. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమ వుతారని చెప్పారు.
Reporter
Telugu Rekha Media