Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శిం చుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్కు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముందుగా హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కల్యాణ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘనస్వాగతం లభించింది. అక్కడ పవన్ కల్యాణ్ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులి చ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేప ట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించ నున్నారు. ఈ క్రమంలోనే తమ ఇల వేల్పు అయిన కొండగట్టు ఆంజ నేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కాగా, గత ఏడాది ఎన్నికల కు ముందు ప్రచారం మొద లుపెట్టిన పవన్ కల్యాణ్. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.
Admin
Telugu Rekha Media