Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/మంథని : మంథని ఇంటింటి సర్వే కోసం హౌస్ లిస్టింగ్ పక్కాగా చేపట్టాలని, వేరే బృందాలు సర్వే చేయాల్సి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు రాకుండా మ్యాపింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణంలోని శ్రీరామ్ నగర్ 4 వ వార్డు లో ఇంటింటి సర్వే సన్నద్దత, వ్యవసాయ మార్కెట్ యార్డు, ఎం.సి.హెచ్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి నీ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఒక ఇంటిలో రెండు కుటుంబాలు ఉంటే వేర్వేరుగా వివరాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం ఎక్కడ నష్టపోకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు.మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ రోగులకు అందుతున్న సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్ వివరాలను కలెక్టర్ పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా అవసరమైన మేర మందులను ఎప్పటికప్పుడు పంపాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. జనరల్ వార్డ్, ఎక్స్ రే రూమ్ లను కలెక్టర్ పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ రాజయ్య ,మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Telugu Rekha Media