Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : తల్లి పాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం అని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు ఎం.రోజా తెలిపారు. స్థానిక ప్రభుత్వం మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సి పల్ ఎన్ఎస్ఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. తల్లిపాలతోనే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని అందువల్ల విద్యార్థులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తోడ్పడాలని చెప్పారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రోజా మాట్లాడుతూ 1992 నుండి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ఆరంభమై, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా120 దేశాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తూ స్త్రీలలో అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. తల్లిపాలతో శిశువుకు రోగనిరోధకత శక్తి మెదడు పెరుగుదల ఏర్పడి తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, మొదటి మూడు రోజులలో వచ్చే పసుపు రంగు ముర్రుపాలలో అనేక ప్రతిరక్షక కణాలు (ఆంటీ బాడీస్) ఉంటాయని వాటివల్ల సహజ నిరోధకత ఏర్పడి తద్వారా శిశువు అనేక ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటుందని వివరించారు. శిశువుకు పాలు ఇవ్వటం ద్వారా తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ సంగీతారాణి, డాక్టర్ జి శ్రీలత, డి సుజాత, అధ్యాపకులు డాక్టర్లు వాసవి, నీరజ, ప్రమోద్ కుమార్, వరప్రసాద్ రామచంద్రం, జమున తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఆరోగ్యపరమైన వివిధ సమస్యలు గూర్చి తెలుపగా వాటన్నిటికీ డాక్టర్ రోజా వివరించి వారిలో అవగాహన కల్పించారు.
Reporter
Telugu Rekha Media