Telugu Rekha Media - రాజకీయం / హన్మకొండ : రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించారు. రైతును రైతుగానే చూడాలని సూచించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది. రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్రావు అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అని, రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అని చెబితే అయిపోవు కదా..? ఆ రోజు అందరిని ఉరుకుమన్నవ్, ఈ రోజు కొందరిని ఆగవడుతున్నవ్.. ఇది ఎక్కడి పద్ధతి..? బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణం ఇచ్చాయి అంతేగాని రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదు. బ్యాంకులకు లేని షరతు, ప్రభుత్వానికి ఎందుకు..? రేషన్ కార్డు షరతు తొలగించి, రుణాలు తెచ్చుకున్నందరికి రుణమాఫీ చేయాలి. గతంలోబీఆర్ఎస్ రుణమాఫీ చేసిన నాడు ఇలాంటి షరతులు మేం పెట్టలేదు. రైతులను రైతులుగా చూసి లక్ష రూపాయల రుణమాఫీ చేశామని హరీశ్రావు గుర్తు చేశారు. పీఎం కిసాన్ డేటాను పరిగణలోకి తీసుకుంటాం అంటున్నారు. అంటే సగానికి సగం రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ఇది. రైతుబంధు కింద 68,99,79 మంది రైతులు లబ్ధి పొందితే, 30 లక్షల 36 వేల మందికి పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందారు. పీఎం కిసాన్ పరిగణలోకి తీసుకోవడం అంటే 39 లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే..!! రైతు బంధు కింద ఏడాదికి రూ. 15,248 కోట్లు, పీఎం కిసాన్ కింద ఇచ్చేది రూ. 1821 కోట్లు. మెజార్టీ రైతులను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు ప్రధానమంత్రి ఇయ్యడు.. ఇటు ముఖ్యమంత్రి ఇయ్యడు. బడేబాయ్ బాటలో చోటే బాయ్ నడుస్తున్నడు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60 శాతం మంది రైతులను దూరం చేయడమే అని హరీశ్రావు పేర్కొన్నారు.
Reporter
Telugu Rekha Media